Saturday, August 23, 2008

బాల సాహితి BALA SAHITI



శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు...


Janmastami Greetings...


ఉప్పలధడియం అన్నపూర్ణ



చిన్నారి చిత్రకారిణి ఉప్పలధడియం అన్నపూర్ణ కలం నుండి జాలువారిన వర్ణచిత్రం

Friday, August 15, 2008

వెబ్ లోకం

వెబ్ లోకం


వెబ్ విశ్వంలో తెలుగు ఏ స్థానంలో ఉందో ఆలోచించి తెలుగు వ్యాప్తికై నేను సైతం కృషిచేయగలనని సంకల్పించే తెలుగువీరుల చైతన్యం కోసమే ‘వెబ్ లోకం’ శీర్షిక. సాహితి పాఠకులలో వెబ్ పరిజ్ఞానాన్ని వికసింపజేయటానికి ఉద్దేశించిన ఈ శీర్షిక లో ధారావాహికంగా ప్రచురితమయ్యే వ్యాసాల పరంపరలో మొదటి వ్యాసం ‘వెబ్ లో తెలుగు’ చదవగలరు.

వెబ్ లో తెలుగు

- డా. సి. జయ శంకర బాబు

వెబ్ విశ్వంలో తెలుగు స్థానం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని, ఆపై తెలుగు అభిమానుల తక్షణ కర్తవ్యం గురించి ఆలోచిద్దాం.

కంప్యూటర్లు పుట్టిన నాటినుండి వాటి సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన భాషగా ఆంగ్లం వర్ధిల్లుతోంది. ఇది మనందరికీ సంతోషకరమైన విషయమే. ఆంగ్లేయులపాలనలో మనకబ్బిన ఆంగ్లభాషా పరిజ్ఞానం మనల్ని కంప్యూటర్ రంగంలోనూ రాణిస్తున్నదేశాల్లో ఒక ప్రముఖ దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు తోడ్పడింది. ఈ పరిజ్ఞానాన్ని మన భాషలకు కూడా అందజేసి మన సంస్కృతి సౌరభాలను విశ్వవ్యాప్తం చేసేందుకు, వెబ్ విశ్వంలోనూ మన భాషల ఆనవాల్లు శాశ్వతంగా ఉండేలా ప్రయత్నించటం మన కర్తవ్యం. అత్యంత అభివృద్ధి చెందిన జపాన్, చైనాలాంటి దేశాలకంటే ముందు మనదేశంలో కంప్యూటర్ వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టగలిగాము. మనకంటే ఆలస్యంగా తమ దేశంలో కంప్యూటర్లకు స్థానం కల్పించిన చైనా ఆదర్శాన్ని గురించి కూడా మనం ఈ క్షణంలో స్మరించటం ముదావహం. చైనీయులు తమ భాషకు స్థానంలేని కంప్యూటర్లకు తమదేశంలో స్థానంలేదంటూ ప్రతినబూని మరీ సాధించారు. మనం ఆంగ్లంలోనే సరిపుచ్చుకున్నా నేడు వెబ్ విశ్వంలో మన భాషల స్థితిగతులేమిటో ఆలోచిస్తే మనకు ఆవేదన కలుగక మానదు.

భారతీయ భాషలకు వెబ్ విశ్వంలో స్థానం దక్కిందని మనం సంతోషంచినా, మనమంతా సమైక్యంగా ముందుకు కదలటంలేదనే సత్యాన్ని గుర్తించవలసి ఉంది. అదెలా అంటే నిన్నటివరకూ మనభాషలకుపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వలన మనం వెబ్ విశ్వంలో విస్తరిస్తున్నామని సంతోషించినా, మనమందరం ఉపయోగిస్తున్నది మాత్రం ఉమ్మడి పరిజ్ఞానం కాదన్నది నిజం. ఉదాహరణకు తెలుగు పత్రికలు, ఇతర మాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఏ కొందరో ఉపయోగిస్తున్నారు. వారు ఉపయోగిస్తున్న ఇతర కోడ్ కలిగిన ఫాంట్ లో ఉన్న కొంత సామగ్రిని సర్చ్ ఇంజన్లు వెదుకుతున్నప్పటికీ వీటి వల్ల మన తెలుగు లభించివలసిన ఉమ్మడి ప్రయోజనం మాత్రం అందటం లేదు. పరివర్తనీయత, పఠనీయత వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో వెబ్ సైట్ కు ఒక ఫాంట్ ను ఉపయోగిస్తుంటే అన్ని ఫాంట్లను మన కంప్యూటర్ లలో డౌన్ లోడ్ చేసుకోవటం కూడా అంత వ్యావహారికం కూడా కాదు. ఫాంటు లేకుండా ఈ-మెయిల్, చాటింగ్ వగైరా కూడా సాధ్యపడదు. ఇలాంటి మరెన్నో కారణాలు, అసౌకర్యాలున్నప్పటికీ యూనికోడ్ వైపెందుకో మన వారి శీతకన్ను. మన తెలుగు పత్రికల వారిని కూడా ఈ దిశలో ముందడగు వేయమని మనమంతా కోరవలసిన బాధ్యాతా ఉంది.

మన తెలుకు సాహితీ సంపద వెబ్ విశ్వంలో వెలుగొందాలంటే మనమందరం తప్పకుండా యూనికోడ్ ను ఉపయోగించాలి. వెబ్ విశ్వంలో మన తెలుగు ఏ మాత్రం వెనుక పడకూడదన్న చైతన్యం కలిగిన అసంఖ్య తెలుగు వీరులు తమ బ్లాగులద్వారా, ఎందరో వీకీపీడియన్లు జ్ఞానయజ్ఞంలోనూ స్వచ్ఛందంగా దివారాత్రాలు శ్రమిస్తుండం వలన నేడు కూడా మనం సగర్వంగా వెబ్ భాషలందునూ తెలుగు లెస్స యని చాటగలుగుతున్నాము. ఈ విషయం మరెందరిలోనో చైతన్యం నింపేదిశగా కూడా మనం ఇప్పుడే కదలాలి. సాహితి అండతో ‘వెబ్ లోకం’ కూడా అదే ప్రయత్నంలో ఉంది.

‘వెబ్ లోకం’ శీర్షికన ప్రచురితమయ్యే తదుపరి వ్యాసం – ‘తెలుగుకు యూనికోడ్ ను ఎలా ఉపయోగించాలి?’ తప్పక చదవగలరు.

(వెబ్ లోకం web lokam by Dr. C. Jaya Sankar Babu)

Thursday, August 14, 2008

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో....

పతాకావిష్కరణ
- మన్నవ గంగాధరప్రసాద్, చెన్నపురి.
నేను
విహంగాన్ని
అపరిమిత స్వేచ్ఛాతత్వాన్ని
సున్నిత హృదయసంబరాన్ని.
నేను
ఒక సామాన్య మానవుణ్ని
సతతకివితాగాన లోలున్ని
బాధాసర్గశత కావ్యాన్ని
ప్రతిరోజూ మరణించే ఉదయాణ్ని
కాగితంపై జీవించే కలాన్ని
కాలాన్ని జయించే బలాన్ని
మది పుష్పాలను పండించే పొలాన్ని
దుర్మార్గహనన యజ్ఞవాటిక సిద్దం చేసే హలాన్ని.
కల్మశోన్మాధ వ్యతిరేక సైన్యాల యుద్దగీతాన్ని
కలసి కలలుగనే మనసుల భవితకు మార్గాన్ని.
సంకుచిత మనోదుర్గుణాలను పెకలించే గునపాన్ని
సమాజవనిలోని క్రూర వృక్షాల దహించే.. దావానలాన్ని.

Monday, August 4, 2008

మన తెలుగు manatelugu


మన తెలుగు పద్యాలు

మన తెలుగు వాజ్ఞ్మయం సదా స్మరించదగిన, గర్వించదగిన పద్యసంపదకు భాండాగారం. బహుశా దక్షిణాది భాషలలో ఈ విషయంలో తెలుగు తరువాతే మరే ఇతర భాషల పద్యాలైన అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి పద్యసంపదకు వారసులమైనందుకు కనీసం కొన్ని ఆణిముత్యాల్లాంటి తెలుగు పద్యాలను గురించి తెలుసుకొనడం తెలుగువారిగా మన కనీసధర్మం. ఈ ధర్మాన్ని నెరవేర్చడంలో మీకు తోడ్పడేందుకు చెన్నపురి తెలుగుకవి శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ సమ్మతించారు. సాహితి ద్వారా మన తెలుగు శీర్షికలో ప్రతి నెల ఆణిముత్యం లాంటి ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేయనున్నారు. ఈ సత్ప్రయత్నానికి మన్నవగారు అభినందనీయులు. ఈ క్రమంలో మొదటి ఆణిముత్యం ...

గజేంద్రమోక్షం

ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందుఁబరమేశ్వరుఁడెవ్వడు మూలకారణం
బెవ్వఁడనాదిమధ్యలయుఁడెవ్వఁడు సర్వము దాన యైనవాఁ
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


ఎవనివలన జగము పుట్టి, పెరిగి, నశించుచున్నదో, ఎవ్వడు అన్ని జీవులకూ ప్రభువో, ఎవ్వడు అన్నిటికీ మూలకారణమో, ఎవరికి ఆది, అంతములు లేవో, ఎవడు సర్వాత్మస్వరూపుడో... అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.

గజేంద్రమోక్షం (పోతనామాత్య విరచితం) నుండి.

బాలసాహితిBALASAHITI

కథ

కోతి తెలివి


సి. విజయేంద్ర బాబు


ఒక ఊరిలో ఒక కోతి ఉంది. అది చాలా తెలివైనది. అది ఒక పెద్ద మర్రిచెట్టు ఎక్కింది. అది మర్రి తొర్రను చూసింది. దానిలో పక్షులు కవకవ అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయా అని చూసింది. ఒక పాము చెట్టుపైకి ఎక్కడం చూసింది. కొమ్మపై కూర్చున్న గద్దను పిలిచింది.


"నీకు పామంటే ఇష్టం కదా" అంది.


" అవును" అంది గద్ద.


"మరి తిను" అంది కోతి.


గద్ద పామును పట్టుకొని ఎగిరింది. ఆవిధంగా కోతి తెలివితో పక్షి పిల్లల్ని కాపాడింది.

చేతకాని వారిని కష్టాలనుండి తప్పించడం మంచి గుణం.

Friday, August 1, 2008

అంతరంగం


దేశ భాషలందు తెలుగు లెస్స యన్న అలనాటి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి వాక్కును నేడు కూడా దేశ వెబ్ భాషలందు తెలుగు లెస్సయని నిరూపించిన తెలుగువీరులందరికీ కృతజ్ఞతాభివందనములతో సాహితి అక్షరయజ్ఞానికి నేడు శ్రీకారం చుడుతోంది. ప్రతి తెలుగు వీరుడు వెబ్ విశ్వంలో తెలుగువ్యాప్తికి తనవంతు అక్షరయజ్ఞానికి నడుంబిగించాలని ఆహ్వానం పలుకుతోంది సాహితి.
నేడు ఆధునిక విజ్ఞాన వికాసంతోపాటు భాషల మధ్య సాంకేతిక అంతరాలు పెరిగిపోతున్నాయి. అంతర్జాలానికి అనువైన భాషగా మొదటినుండే రూపొందిన ఆంగ్లం అన్నిభాషలూ ఎదగనంత ఉన్నతస్ధాయికి ఎదిగిపోయింది. మన భాషలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చకపోయినా కంప్యూటర్లను ఆదరించి మనం సైతం ఆంగ్లంలోనే పనిచేస్తూ ఉండటం వల్లనే ఈ అంతరాలు మరింత పెరిగిపోయాయి. యూనికోడ్ ఆవిష్కారంతో వెబ్ విశ్వంలో భారతీయ భాషల వికాసానికి, మన భాషలమధ్య సాంకేతిక అంతరాలను నిర్మూలించడానికి మార్గం సుగమమైంది. మనం తెలుగును వెబ్ విశ్వంలో దిగంతాలవరకూ వ్యాపింపజేసేందుకు అనువైన సమయం ఆసన్నమైనప్పటికీ తెలుగుపత్రికలు, ఇతర ప్రచారమాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఉపయోగించకపోవటంవల్ల మనం తెలుగు వ్యాప్తికి తీరని అన్యాయం చేస్తున్నామన్నది అక్షర సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని యూనికోడ్ ని ఉపయోగిస్తూ సుసమృద్ధమైన తెలుగు భాషా సంపదనూ, వాజ్ఞ్మయాన్నీ విశ్వవ్యాప్తంచేయటానికి మనం తక్షణం ముందడుగు వేయాలి. వీకీపీడియాలో ఎందరో నిస్వార్థ తెలుగువీరులు తెలుగు కీర్తిపతాకం ఎగురవేయటానికి నిరంతరం శ్రమిస్తుండటంచేత దేశభాషలందు తెలుగులెస్సయన్న వాక్కు వీకీపీడియాలోనూ నిరూపితమైంది. ఇంతటితో తెలుగు వెబ్ విశ్వంలో వికసించిందని సంతృప్తిచెందటం పొరపాటే. అన్నింటా మనం ముందున్నామనే సంతోషం మనకు మిగలాలంటే వెబ్ విశ్వంలో తెలుగుభాషకు తిరుగులేని వేదికగా యూనికోడ్ ను మనమందరం ఆదరించి ప్రయోగించవలసిన సమయమిదే. కంప్యూటర్ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరి సహకారంతో వెబ్ విశ్వంలో తెలుగు చైతన్యదీప్తిని ప్రసరింపజేయటానికీ, వెబ్ విశ్వంలో తెలుగు భాషా సాహిత్యాలవికాసంతో పాటు మానవతా విలువలను కాపాడటంలోనూ తనవంతు సహాయం ఉడుతాభక్తితో నెరవేర్చే సంకల్పంతో సాహితి ఈరూపంలో మీ ముందుకు వచ్చింది.
మంచి తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తూ, తెలుగువెలుగులూ, మానవతావిలువలూ దిగంతాలకు ప్రసరింపజేసే ప్రయత్నంలో సాహితికి తమరి ఆదరాభిమానాలే కొండంత అండ. వెబ్ విశ్వంలో ఈ అక్షర యజ్ఞానికి మీరు సైతం నడుం బిగించాలని సాహితి ఆహ్వానం పలుకుతోంది. తేనెలొలుకు తెలుగుభాషా మాధుర్యాన్ని అందరికీ పంచేందుకు తమరు చేసే ప్రతి ప్రయత్నానికి సాహితి తనవంతు చేయూతను తప్పక అందిస్తుంది.

కొన్ని రచనలతో నేడు ప్రారంభమైన సాహితి నిరంతరం కొత్త రచనలతో మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. మీరు ఏ రచన విషయంలో నైనా ఆ రచన చివరన ఉన్న comments పై క్లిక్ చేసి అక్కడే తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచవచ్చును. నిత్యమూ సాహితి సందర్శిస్తూ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించవలసినదిగా కోరుతూ...
అక్షర అభివందనాలతో...


శ్రీవైష్ణవి విజయ్ రాధిక జయ శంకర బాబు

బాల సాహితి



అంజలి

- ఉప్పలధడియం రవితేజ

ఆ.వె. అమరజీవి వలన ఆంధ్ర రాష్ట్రము వచ్చె
దీని మరువరాదు తెలుగువారు
ఎక్కడున్నగాని ఎల్లప్పుడతనిని
తలచుకొనుట మనకు ధర్మమగును.

ముత్యాల సరములు

- ఉప్పలధడియం రవితేజ

పల్లెలోనూ పట్నమందూ
తేజుగాడూ అన్నపూర్ణా
ఒంటెమీదా ఓడలోనూ
తేజుగాడూ అన్నపూర్ణా
అప్పడాలూ, ఆవకాయా
ఎర్రగడ్డా, గనుసుగడ్డా
కందగడ్డా, ఉర్లగడ్డా
నాకుమాత్రం పట్టదోయ్.

పత్రికా సమీక్ష


తెలుగు వారి సమైక్యతే లక్ష్యంగా పురోగమిస్తున్న
నడుస్తున్న చరిత్ర


- డా. సి. జయ శంకర బాబు


తెలుగు భాషా సంస్కృతుల ప్రచారమే ధ్యేయంగా తెలుగు వారి సమైక్యతే లక్ష్యంగా పురోగమిస్తున్న నడుస్తున్న చరిత్ర గత 16 సంవత్సరాలుగా విజయవాడ నుండి నిరంతరాయంగా వెలువడుచున్నది. వివిధ ప్రాంతాలలో, వృత్తులలో, జనజీవనంలో ఉన్న పదాలవాడుక పెంచుతూ, ఇతర భాషాపదాలను అనవసరంగా ఉపయోగించకుండా తెలుగును ఉమ్మడి ప్రామాణిక భాషగా రూపొందించుకుందామన్నది ఈ పత్రిక ప్రచురణకర్తల వాక్కు. అవసరమైతే మనభాషలోనే కొత్త పదాలను తయారుచేయండనే సందేశాన్ని ఈ పత్రిక అందిస్తోంది. ఈ సందేశంలో వ్యావహారికత గురించి మనమాలోచిస్తే మనకు లభించే నిష్కర్షేమిటంటే కొత్త పదాలెన్ని తయారుచేసినా వాటి వాడుక చాలా ముఖ్యం. తెలుగు దిన పత్రికలలో, సినిమాలలో, బుల్లితెర కార్యక్రమాల్లో అటువంటి పదాలను నిరంతరం ఉపయోగిస్తే అవి జనజీవన స్రవంతిలో కలిసిపోగలవు. అన్ని తెలుగు ప్రచారమాధ్యమాలలో ఇలాంటి చైతన్యాన్ని నింపేదిశగా నడుస్తున్న చరిత్రతో పాటు మనమూ పురోగమిస్తే తెలుగుతేజాన్ని నలుదిశలా వ్యాపింపజేయటం సాధ్యమే.
విభిన్న ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల సమైక్యతనూ, తెలుగుభాష ఔన్నత్యాన్నీకాంక్షిస్తూ నడుస్తున్న చరిత్రలో సంపాదకులు సోమల రమేష్ బాబు గారు రాస్తున్న సంపాదకీయాలు భాషాచైతన్యాన్ని పెంపొందించుకోవాలన్న తపన గల ప్రతి తెలుగు వాడి నాడికి సరికొత్త స్పందననందిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. ఉద్యమచైతన్యంతో ముందుకు సాగుతూ తెలుగుజాతి వేదికగా రూపందుకున్న ఈ పత్రికలో తెలుగు భాషా, సంస్కృతులపై వ్యాసాలు, పరిశోధనా ఫలితాలే కాకుండా తెలుగువారికి సంబంధించిన వర్తమాన సంఘటనలు, సాహితీరంగవార్తలు, కథ, కవితలు పత్రిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇటీవలే వెలువడిన జూలై 2008 సంచికలో సంపాదకహృదయం ‘తెలుగుజాతి కోసం పోరాడే రాజకీయం కావాలి’ అన్నశీర్షికతో రాసిన సంపాదకీయంలో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశ సంఖ్య 76/10-6-2008 పట్ల ఆవేదన, వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమౌతోంది. ‘తెలుగు భాషా పదసంపదను కాపాడుకోవడానికి ఏంచేద్దాం?!’ అంటూ చూపు శీర్షికలో జయధీర్ తిరుమలరావుగారి పరిశోధనాత్మక వ్యాసం, తెలుగు సిరి శీర్షికన ‘తెలుగు క్లాసికల్ భాష కాదా?’ అంటూ ప్రశ్నిస్తూ ఆచార్య ఆర్వీయస్ సుందరంగారు తమ వ్యాసంలో గిడుగు సీతాపతిగారు కేంద్రసాహిత్య అకాడమీకి వ్రాసిన సాహిత్యచరిత్రలో ఉన్న అబద్దాలే తమిళులకు పనికివచ్చాయని ఉద్ఘాటించారు. వాస్తవానికి మనం ఇటువంటి అబద్దాల పుట్టలు పెరుగుతున్న సందర్భాలలో వెంటనే స్పందించకపోవటంవల్లనే ఇటువంటి గ్రంథాలు ప్రామాణిక గ్రంథలైపోతున్నాయేమోననిపిస్తుంది. చరిత్రకు సంబంధించిన విషయంలో ఏ గ్రంథమైనా ప్రామాణికతను పొందుతోందంటే అందులో ఉన్న నిజాలైనా, అబద్దాలైనా మనం మౌనంగా అంగీకరించబట్టే. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. సుందరం మేష్టారుగారిలాంటి వారు తమకలాల్ని ఝళిపిస్తే తెలుగుకు ఎంతోకొంత మేలు చేకూరుతుంది, సత్యమేవ జయతేకూ సార్థకత సిద్ధిస్తుంది. వ్యాఖ్యానం, తెలుగుతనం, స్వాభిమానం, పరిశోధన, న్యాయపీఠం, జ్ఞాపకాలదొంతర, అన్వేషణ మొదలైన ఆకర్షణీయమైన శీర్షికలలో రచయితలు ఆసక్తికరమైన విషయాలపై తమ భావాలను వ్యక్త పరిచారు. పరామర్శ ప్రణామం శీర్షికన పుస్తక సమీక్ష, గ్రంథాలయం శీర్షికన గ్రంథస్వీకారం సచిత్రంగా ప్రచురించారు. స్పందన శీర్షికలో గత సంచికలలోని రచనలపై పాఠక స్పందనకు స్థానందక్కింది. తెలుగువాణి సారథ్యంలో తెలుగుసంఘాల సమైక్యతలో 5, 6 జూలై 2008 న తిరుచ్చిలో ఘనంగా జరిగిన దక్షిణ భారత తెలుగు పల్లెకళల పండుగకు సంబంధించిన సచిత్రవార్తలతోపాటు పూజకుణిత కళారూపం ముఖచిత్రంగా వెలువడిన ఈసంచిక అవశ్యం పఠనీయం. నడుస్తున్న చరిత్ర ప్రతి సంచికలోనూ తెలుగు నవచైతన్యదీప్తి గోచరిస్తోంది. నేటి సాంకేతిక యుగంలో తెలుగుభాష ఔన్నత్యానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వెబ్ విశ్వంలో విస్తరిస్తున్న తెలుగు ఆనవాళ్ళగురించికూడా ఈపత్రికలో స్థానం కల్పిస్తే పత్రిక భాషాఉద్యమస్ఫూర్తికి సంపూర్ణత చేకూరుతుంది. రాబోయే సంచికలలో ఈ దిశగా ప్రయత్నించగలరని సాహితి ఆశిస్తోంది.

కవిత

అతివాదం విశ్వరోగం

- ఏ. రాధిక

ఊయల ఊగదాయె
జోలపాట మూగబోయె
పైరుగాలి నాట్యమాగె
సెలయేరు హోరు మరచె

కన్నతల్లులెందరో గుండెలవిసేలా
రోదనలు మిన్నంటేలా
ఎటుచూసినా ఆ ఏడుపే మారుమ్రోగె

గుండెల్లో భయం, కాలు బయట పెట్టాలంటే భయం
మెన్న దేశ సేవలో వందల జవాన్లు
నిన్న అన్నం పున్నెమెరుగని అమాయకపు ప్రజలు
నేడేమో.... రేపోమో.... ఎన్నాళ్ళీ భయం
కన్న తల్లులకీ గర్భశోకం
మనిషిని చూస్తే మనిషికి భయం
ఏ జాతి జీవికి లేని వింతరోగం
బాంబులు, మానవబాంబులతో విధ్వంసం సృష్టంచే విశ్వరోగం
అతివాదానిదదే అసలు స్వరూపం

ఏ ప్రభుత్వాలు మార్చలేవు, ఏమార్చనూలేవు
మతాలు కులాలన్నవి మట్టికరిచే దాకా
మనసున ఆ అంతర్యామి రూపం ఒక్కటిగా కనపడుదాకా
ఈ రోగం మానదు, ఈ శోకం ఆగదు

పెరుగుతున్న విజ్ఞానం మనిషిని మనిషికి
దగ్గర చేయాలని మన అందరి ఆశ
అది పెడదోవ పట్టి మనిషికి మనిషికి మద్య
అగాధం సృష్టిస్తుంటే ఆదిమ మానవుడైపోతేనే నయం
అపుడీ రోగాలేవి ఉండవన్న ఆశాభావం.

(ATIVAaDAM VISHVAROGAM – A Telugu Poem by A. Radhika for SAAHITEE)