Saturday, October 3, 2009

వరదబాధితులకు తక్షణ సహాయం – మానవీయ కర్తవ్యం

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2 అక్టోబర్, 2009 న వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో సహాయానికి సైతం నోచుకోక వరదప్రాంతాల్లో ఇరుక్కుపోయి విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, ఉత్తర కర్ణాటక జిల్లాలు, కార్వార్ ప్రాంతాలు, మహారాష్ట్రలోని దక్షిణాది ప్రాంతాలప్రజలు ఆకస్మిక వరదలకారణంగా విపత్కరపరిస్థితులను ఎదుర్కొనుచున్నారు. తక్షణ సహాయం అందక మానవీయత మంటగలుస్తున్నది. ప్రాంతీయ భాషామీడియా పూర్తి ప్రాంతీయచైతన్యంతో మాత్రమే ముందుకు కదులుతున్నందున్నట్టనిపిస్తోంది. జాతీయస్థాయి ఛానెల్స్ ఈ విపత్తును విస్మరిస్తుండటం మరీ విడ్డూరం. ఈ అత్యవసర పరిస్థితిలో అవసరమైన వీరికి అవసరమైన సహాయం కోసం కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైనే ఆధారపడి వీక్షిస్తూ ఉంటే వరద పీడితులందరూ మరింత దారుణ కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. నిర్ణయాధికారుల ఉదాసీనతతో ఇంతటి తీవ్రదారుణ పరిస్థితులేర్పడ్డాయని మీడియా ఘోషిస్తోంది. ఈ తరుణంలో సహాయపడే హృదయంగలవారంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమచేతనైన సహాయంతో వరదబాధితులను ఆదుకోవాలి. ఇందుకు కేవలం డబ్బు మాత్రమే సహాయం చేయగలిగితే తక్షణం ఒనగూరే ప్రయోజనం అంతగా ఉండదు. పడవలు, ఇతర వాహనాలున్న వారు వరదప్రాంతాల్లో సహాయంకోసం అర్థిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు, వరదబాధలేని పరిసర ప్రాంతాలవాసులు వరదబాధితులకు వెంటనే అవసరమైన తిండి, నీరు, దుస్తులు, దుప్పట్లు మొదలైన వాటితో ఆపన్నహృదయులై వెంటనే ఆదుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఆలస్యం అమృతం విషం అన్నస్థితిని బాధితులు ఎదుర్కోవలసి వస్తుంది. మనం చేసే తక్షణ సహాయమే బాధితులకు అమృతం. వరదపీడిత ప్రాంతాల ఇరుగుపొరుగు గ్రామ, పట్టణ, జిల్లాలవాసులు తక్షణమే స్పందిస్తే మానవత్వం మన్నగలుగుతుంది. పీడితులు ఆత్మస్థైర్యం కోల్పోకమునుపే మన చేయగలిగిన తప్పకుండా చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా కేవలం సంబంధిత విభాగాల వారు మాత్రమే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే లక్షలాది బాధితులకు తక్షణ సహాయం అందక పోవచ్చు. పరిసర ప్రాంతాల అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను సహాయక కార్యక్రమాలలో వినియోగించేందకు ఉన్నతాధికారులు అవసరమైన అనుమతిని ప్రేరణను ఇవ్వాలి. వ్యాపారస్థులు, ఉద్యోగులు కూడా ఆపన్నహృదయులై తక్షణ సహాయంకోసం స్పందించి మానవీతను కాపాడగలరని సాహితి ఆశిస్తూ అర్థిస్తున్నది.

1 comment:

సుజాత వేల్పూరి said...

ఇటువంటి సమయాల్లో సహాయం వ్యక్తిగతంగా కంటే సంఘటితంగా చేయడం సులువు అవుతుంది.లోక్ సత్తా పార్టీ సహాయ కార్యక్రమాల్లోకి నడుం కట్టి దిగింది. విరాళాల సంగతెలా ఉన్నా, ఆహార పదార్థాలు(త్వరగా చెడిపోని బిస్కెట్ పాకెట్స్,రస్కులు వంటివి,ఇంకా గ్లూకోజ్ పాకెట్లు,ORSపాకెట్స్ వంటి వైద్య సంబంధ వస్తువులు),బట్టలు, దుప్పట్లు వంటివి ఇవ్వాలనుకుంటే లోక్ సత్తా పార్టీ ఫోన్ నంబర్ ని సంప్రదిస్తే, పార్టీ కార్యకర్తలు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. బాధితులకు చేరవేసే పని పార్టీ చూసుకుంటుంది. ఆసక్తి ఉండి సహాయం చేయగలిగిన శక్తి ఉన్నవారు 040-40405050 ఫోన్ నంబర్ ని సంప్రదించవచ్చు.థాంక్యూ!