Saturday, January 23, 2010

నేడు సుభాష్ చంద్ర బోస్ జయంతి (23 జనవరి)

కవిత

సుభాష్ చంద్ర బోస్ అమర్ రహే


-శ్రీమతి ములుగు లక్ష్మి మైథిలి, నెల్లూరు.

భరత మాత ప్రియసుతుడు
ఆ తల్లి దాస్య విముక్తి కై పోరాడినహితుడు
బ్రిటష్ వారిని ఎదిరించిన స్వరాజ్యప్రదాత
నేటి యువతకు కావాలి ఆ చేయూత
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి
నేటి యువతకు స్ఫూర్తి
నేతాజీ సందేశం సజీవం
ధీరుడు, శూరుడు, అమరుడు
సాయుధ సంగ్రామoలో గగనంలో కలిసిన
సుభాష్ చంద్ర బోస్ అమర్ రహే

***




ఒంగోలు లో జనవరి 8,9 మరియు 10 తేదీన జరిగిన 6వ రాష్ట్రస్థాయి రచయితల మహాసభలో బి. హనుమారెడ్డి (అద్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ) చేతులమీదుగా కవితాపురస్కారాన్ని అందుకుంటున్న శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలిగారు.

Friday, January 1, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...



ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!



- డా. బషీర్, చెన్నపట్టణం.


కొత్త ఆశయాలకు కొత్త భావాలకు
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2010 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2010లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.

Monday, November 30, 2009

హైకూలు Hykoos



హైకూలు



- డా. ఎస్. బషీర్, చెన్నై.



కొన్ని బంధాలు


కాయిన్ బాక్సులు


డబ్బిస్తేనే పలుకు


భీకర యుద్ధం
శవాల గుట్టలు
రాబందుల పండుగ

గడ్డి పరక
భయంతో వణుకుతూ పాపం
హిరోషిమాలో మొలకెత్తు

బంధాలు -పర్వతాలు
దూరం నుండి చూస్తేనే
అందంగా ఉండు

పాషాణ హృద్వి
అబద్ధ పర్వతాన్ని
చీల్చు ఓ చిన్ననిజం

భీకర సునామి
ప్రాచీన యుగసృష్టి
క్షణం లో మాయం

మేఘాల్ని తాకుతూ
పక్షి ఉత్సాహంగా
సాగింది పాపం

చల్లని సెలయేళ్ళు
పచ్చని చేల గట్లు
ఏవీ ఆ గ్రామాలు


గారాల బిడ్డ
అత్తవారింట్లో
గారెలా కాలిందే


జీవితం లో
కఠినమైనది
నెమ్మది తనం

Saturday, October 24, 2009

కవిత



వరదలు


- రాజశేఖర్, చెన్నై



1) ఆంధ్రావనిలో – వరదలొచ్చె
పంటలు కోల్పోయి – పశువులు కోల్పోయి
నివాసాలు కోల్పోయి – కుటుంబాలే చేల్లాచెదురాయె
గుండె చెదిరె గూడు చెదిరె
2) గలగల పారే కృష్ణా, జీవనదులు ప్రవహించె
కన్నీటజలమాయె రాయలసీమ,
నాటి రత్నాలసీమ, నేటి కన్నీళ్ళ సీమగా పరిణమించె
3) పచ్చని పైరులతో, పచ్చగ ఉండి
సశ్య శ్యామల తెలుగు నేలను నమ్ముకున్న రైతన్న నష్టపోయె!
4) కూడు-గూడు లేక ఆకలికేకలు
ఆర్తనాదాలు మిన్నంటుతుంటే
పాలకులే త్యాగాలు చెయ్యాలి
అందరికీ చేయూత నివ్వాలి
5) క్షణం కాదు యుగాలైన
సాఫీగా బ్రతకగలమంటు
ధీమా వ్యక్తం చేస్తున్నవారెందరికో
జీవితమంటే ఏమిటో తెలిసిపోయె
భోగభాగ్యాలు సమసిపోయె,
*****

Sunday, October 18, 2009

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి దీపాల వెలుగు

కావాలి జగమంత వెలుగు

దీపావళి శుభాకాంక్షలతో...

- సాహితి

Saturday, October 3, 2009

వరదబాధితులకు తక్షణ సహాయం – మానవీయ కర్తవ్యం

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2 అక్టోబర్, 2009 న వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో సహాయానికి సైతం నోచుకోక వరదప్రాంతాల్లో ఇరుక్కుపోయి విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, ఉత్తర కర్ణాటక జిల్లాలు, కార్వార్ ప్రాంతాలు, మహారాష్ట్రలోని దక్షిణాది ప్రాంతాలప్రజలు ఆకస్మిక వరదలకారణంగా విపత్కరపరిస్థితులను ఎదుర్కొనుచున్నారు. తక్షణ సహాయం అందక మానవీయత మంటగలుస్తున్నది. ప్రాంతీయ భాషామీడియా పూర్తి ప్రాంతీయచైతన్యంతో మాత్రమే ముందుకు కదులుతున్నందున్నట్టనిపిస్తోంది. జాతీయస్థాయి ఛానెల్స్ ఈ విపత్తును విస్మరిస్తుండటం మరీ విడ్డూరం. ఈ అత్యవసర పరిస్థితిలో అవసరమైన వీరికి అవసరమైన సహాయం కోసం కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైనే ఆధారపడి వీక్షిస్తూ ఉంటే వరద పీడితులందరూ మరింత దారుణ కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. నిర్ణయాధికారుల ఉదాసీనతతో ఇంతటి తీవ్రదారుణ పరిస్థితులేర్పడ్డాయని మీడియా ఘోషిస్తోంది. ఈ తరుణంలో సహాయపడే హృదయంగలవారంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమచేతనైన సహాయంతో వరదబాధితులను ఆదుకోవాలి. ఇందుకు కేవలం డబ్బు మాత్రమే సహాయం చేయగలిగితే తక్షణం ఒనగూరే ప్రయోజనం అంతగా ఉండదు. పడవలు, ఇతర వాహనాలున్న వారు వరదప్రాంతాల్లో సహాయంకోసం అర్థిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు, వరదబాధలేని పరిసర ప్రాంతాలవాసులు వరదబాధితులకు వెంటనే అవసరమైన తిండి, నీరు, దుస్తులు, దుప్పట్లు మొదలైన వాటితో ఆపన్నహృదయులై వెంటనే ఆదుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఆలస్యం అమృతం విషం అన్నస్థితిని బాధితులు ఎదుర్కోవలసి వస్తుంది. మనం చేసే తక్షణ సహాయమే బాధితులకు అమృతం. వరదపీడిత ప్రాంతాల ఇరుగుపొరుగు గ్రామ, పట్టణ, జిల్లాలవాసులు తక్షణమే స్పందిస్తే మానవత్వం మన్నగలుగుతుంది. పీడితులు ఆత్మస్థైర్యం కోల్పోకమునుపే మన చేయగలిగిన తప్పకుండా చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా కేవలం సంబంధిత విభాగాల వారు మాత్రమే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే లక్షలాది బాధితులకు తక్షణ సహాయం అందక పోవచ్చు. పరిసర ప్రాంతాల అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను సహాయక కార్యక్రమాలలో వినియోగించేందకు ఉన్నతాధికారులు అవసరమైన అనుమతిని ప్రేరణను ఇవ్వాలి. వ్యాపారస్థులు, ఉద్యోగులు కూడా ఆపన్నహృదయులై తక్షణ సహాయంకోసం స్పందించి మానవీతను కాపాడగలరని సాహితి ఆశిస్తూ అర్థిస్తున్నది.